01-11-2025 12:00:00 AM
రాజేంద్రనగర్, అక్టోబర్ 31 ( విజయ క్రాంతి ): అధికారుల నిర్లక్ష్యానికి తోడు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో శివరాంపల్లిలోని ప్రభుత్వ బిసీ వసతి గృహం ఆవరణలో గత మూడు రోజులుగా వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వసతి గృహంలో నుంచి బయటకు, బయట నుంచి లోపలికి వెళ్లలేక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. విద్యార్థులు పాఠశాలకు ఈ వరద నీటిలో నుంచే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
ఈ సమస్య ఏ ఒక్క రోజుదో కాదు.. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే సమస్య తెలుపుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వసతి గృహం పక్కనే శివరాంపల్లి ఉర చెరువులో నుంచి కూడా భారీగా వచ్చే వరద నీరు వసతి గృహం ఆవరణలోకి వచ్చి చేరుతుండటం తో ఈ సమస్య దాపురిస్తుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ సార్ అయినా ఈ సమస్య ను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.