07-05-2025 01:09:52 AM
- మోటార్ వాహన చట్టాలను అతిక్రమిస్తే శిక్ష తప్పదు.
- జిల్లా అదనపు ఎస్పీ సిహెచ్ రామేశ్వర్
నాగర్ కర్నూల్ మే 6 (విజయక్రాంతి): ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగి తనతో పాటు తన కుటుంబం కూడా రోడ్డున పడే కంటే ముందే మోటార్ వాహన చట్టాల నిబంధనలను పాటించాలని జిల్లా అదనపు ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ వాహనదారులకు సూచన చేశారు. మంగళవారం జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు కొల్లాపూర్ చౌరస్తాలో నాఖబందీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కొద్ది సమయంలోనే వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా ఇతర నిబంధనలను పాటించకుండా వాహనదారులు పోలీసులకు చిక్కాయి. ఆర్టీసీ బస్సులు ఇతర గూడ్స్ వాహనాలు సైతం ఫిట్నెస్ ఇన్సూరెన్స్ తదితర నిబంధనలు ఏవి పాటించడం లేదని ఏఎస్పి రామేశ్వర్ వాహనదారులకు అవగాహన కల్పించారు. ఏదైనా ప్రమాదం జరిగి తమ కుటుంబాలు రోడ్డున పడి తీవ్ర ఇబ్బందులకు గురయ్యే కంటే ముందే మోటర్ వాహన చట్టం రోడ్ సేఫ్టీ వంటి నిబంధనలు పాటించాలన్నారు.
ఆర్టీసీ బస్సులు కూడా ఇన్సూరెన్స్ లేకుండానే నడపడంపై అసహనం వ్యక్తం చేశారు. సుమారు పది నిమిషాల్లోనే 100కు పైగా వాహనాలు పట్టు పడడంతో అందరికీ అవగాహన కల్పించి మొదటి తప్పుగా వదిలేశారు. ఇకపై నిబంధనలు పాటించకుండా రోడ్డుపై వాహనాలు నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులు శిక్షణార్హులు అవుతారని హెచ్చరించారు. వారితోపాటు ఎస్త్స్ర గోవర్ధన్ ఇతర 40 మందికి పైగా పోలీస్ సిబ్బంది ఉన్నారు.