14-06-2025 08:25:52 PM
బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో ఏపీ జల దోపిడి చేస్తున్నది: హరీష్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ మౌనంపై తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కృష్ణా జలాల్లో జలదోపిడి జరిగినట్లు, గోదావరి జలాలను బనక చర్ల ద్వారా ఏపీ దోపిడి చేస్తున్నదని ఆరోపించారు. సీఎం రేవంత్(CM Revanth Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని, కేటీఆర్ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడంలో బిజీ ఉన్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల మీద ఇరిటేషన్ తప్ప, ఇరిగేషన్ మీద దృష్టి లేదని, రాష్ట్ర ప్రయోజనాలు పదవుల కోసం తాకట్టు పెడుతున్నారని వివరించారు.
ఏపీ అక్రమ ప్రాజెక్టు కడుతుంటే మీ మౌనం వెనుక ఉన్న కారణం..? గోదావరి బనకచర్లకు టెండర్లు పిలుస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని విమర్శించారు. కృష్ణా నీళ్ళు తాత్కాలిక ఒప్పందానికి మించి ఏపీ తీసుకుపోతుంటే ఎందుకు మాట్లాడరు..? గోదావరి నదిలో తెలంగాణకు ద్రోహం తలపెడితే ఎందుకు స్పందించరు..? నిధులు, నదులు రెండు ఆంధ్రకే.. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా నిధుల్లో, నదుల్లో అన్యాయం జరిగినా మాట్లాడరు..? అని పేర్కొన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి నోరు మెదపడం లేదన్నారు. 2 టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర మీద చంద్రబాబు పెద్ద పోరాటం చేశారని, మరి నేడు 200 టీఎంసీల బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత పోరాటం చేయాలన్నారు.
రేవంత్ రెడ్డి ఎందుకు ఒక్క మాట మాట్లాడటం లేదని, మీ దోస్తానా కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడతారా రేవంత్..?, తెలంగాణ కంటే పది రెట్ల నిధులు ఆంధ్రకి ఇచ్చినమని స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రాలో చెప్పాడని తెలిపారు. కేంద్రంలో పరపతితో చంద్రబాబుపై నుండి కాకుండా పోలవరం నుండి నీళ్ళు మళ్ళించి, కేంద్రం నుండి నదుల అనుసంధానం పేరుతో నిధులు తెచ్చుకున్నదని అన్నారు.
అయినా రేవంత్ రెడ్డికి, మంత్రులకు కదలిక లేదని, ఇప్పటికైనా కళ్ళు తెరవండి.. నష్టం పూర్తిగా జరగకముందే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అడ్డుకావాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏ రకమైన పోరాటంలోనైనా బీఆర్ఎస్ కలిసి వస్తుంది.. అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటే సహకరిస్తాం.. మీరు ముందుకు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటానికి, న్యాయపోరాటానికి శ్రీకారం చుడుతుందని మంత్రి హరీష్ తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టకు.. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు బంద్ చేయి.. చరిత్రహీనుడిగా మిగిలిపోకు అని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మౌనం వీడండి.. చంద్రబాబు జల దోపిడిని అడ్డుకోండి అని ప్రెజెంటేషన్ ద్వారా మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.