6 August, 2026 | 4:06 PM

ప్రజా ఆకాంక్షలే పరమావధిగా పాలన: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

06-08-2026 03:00 PM

- కూసుమంచి మండలంలో రూ.6.74 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కూసుమంచి: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్‌.తో కలిసి కూసుమంచి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల పురోగతే లక్ష్యంగా రూ.6.74 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి శంకుస్థాపనలు చేశారు.

రాజుపేట బజార్ గ్రామం వద్ద ఈశ్వరమాదారం నుంచి భద్రుతండా వరకు రూ.1.76 కోట్లతో, తాళ్లగడ్డ తండా వరకు రూ.50 లక్షలతో బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శ్రీకారం చుట్టారు. అనంతరం చౌటుపల్లి గ్రామంలో రూ.3.20 కోట్లతో నిర్మించనున్న హైలెవెల్ వంతెనకు, లింగారం తండాలో రూ.1.28 కోట్లతో చేపట్టనున్న ఆర్‌అండ్‌బీ బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో చౌటుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అనేక అభివృద్ధి పనులు చేశానని, ఇప్పుడు మంత్రిగా గ్రామంలోని మిగిలిన అన్ని పనులనూ పూర్తి చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లింగారం తండాలోనే రూ.5.45 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, తండాలో వీధిదీపాల ఏర్పాటును తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలోని ప్రతీ రేషన్ కార్డుదారునికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. గృహ నిర్మాణ రంగానికి ప్రాధాన్యమిస్తూ తొలి విడతలో 4.5 లక్షలు, మలి విడతలో 2.5 లక్షలు, హైదరాబాద్‌కు మరో లక్ష కలిపి మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని వెల్లడించారు.

కొద్ది రోజుల్లోనే రెండో విడత ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా ప్రారంభిస్తామన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతు భరోసా నిధులను ఇప్పటికే జమ చేశామని, వరి కొనుగోళ్లలో సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గ పరిధిలో భూ రీ-సర్వే ప్రక్రియ వేగంగా జరుగుతోందని, త్వరలోనే నకిలీ పాస్‌పుస్తకాలను రద్దు చేసి, అర్హులైన ప్రతీ నిజమైన రైతుకూ న్యాయబద్ధమైన పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు.

- రైతులతో మమేకమైన మంత్రి

అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం లింగారం తండాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా పొలంలోకి దిగి ఎద్దుల అరక పట్టి దుక్కి దున్నారు. స్థానిక రైతులతో కలిసి ముచ్చటించి, వ్యవసాయ పరిస్థితులు, పంటల పురోగతిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, డీవైఎస్‌వో సునీల్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ అధికారులు, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.