20-06-2025 12:00:00 AM
ముషీరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): ఆర్ఎస్ఎస్, బీజేపీ కనుసన్నల్లో తీసిన రజకార్ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చి తెలంగాణను అవమాన పర్చిందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్రను, సంస్కృతిని వక్రీకరించి రజకార్ సినిమా తీశారని ఆరోపించారు. రజాకార్ సినిమాకు ఇచ్చిన అవార్డును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.
గురువారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ హైదరాబాద్ చాప్టర్(ఏపీసీఆర్) ఆధ్వర్యంలో రజకార్ ఫాక్ట్స్ ఆర్ ఫాల్స్ హుడ్ ద గద్దర్ అవార్డ్ కాంట్రవర్సీ అనే అంశంపై హనీఫ్ అహ్మద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ మాట్లాడుతూ రజాకార్ సినిమా తెలంగాణ చరిత్ర వారసత్వానికి విరుద్ధంగా తీశారని అన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పసునూరి రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర సంస్కృతి జానపదానికి రజాకార్ సినిమా పూర్తి వ్యతిరేకమని విమర్శించారు. రచయిత స్కైబాబా మాట్లాడుతూ ముస్లింలను అవమానించేలా ఆర్ఎస్ఎస్, బీజేపీ బాటలోనే సినిమాను రూపొందించారని విమర్శించారు.
గద్దర్ అవార్డును వెనక్కి తీసుకోవాలని కోరారు. సిపిఐ కార్మిక నేత స్వర్గీయ రాజబహదూర్ సోదరి అవరీచ్ బాణీ మాట్లాడుతూ తప్పులను మతానికి అంటగట్టడు సరైంది కాదని, రజాకార్లను కూడా నాడు కొంతమంది ముస్లింలు వ్యతిరేకించారని ఆమె అన్నారు.
రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కన్నెగంటి రవి మాట్లాడుతూ తెలంగాణ వాస్తవ చరిత్రను ఈ సినిమాలో చూపించలేదన్నారు. ఈ సినిమాతో ముస్లిం సమాజాన్ని అపహాస్యం చేశారని ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ అన్నారు. ఈ సమావేశంలో న్యాయవాది అఫ్సర్ జహాన్, పరాజ్ అహ్మద్, మరియా అరిఫుద్దీన్, ప్రేమ్ రాజ్, సారామాథ్యూస్ తదితరులు పాల్గొన్నారు.