05-08-2025 08:56:14 PM
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని బురదగూడెం త్రిశక్తి అష్టలక్ష్మి, కామాఖ్యదేవి మహంకాళి దేవాలయంలో అమ్మవారికి గాజుల మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఆలయంలో నిర్వహించిన గాజుల మహోత్సవంలో పట్టణానికి చెందిన మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూలు, గాజులు సమర్పించి, కుంకుమ పూజ, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారి సతీష్ భవాని మాట్లాడుతూ... శ్రావణ మాసం ఏకాదశిని పురస్కరించుకొని మహిళలు గాజుల మహోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. కుంకుమార్చన సౌభాగ్య వృద్ధికై, ఆయువు ఆరోగ్యాలు అందరికి ప్రసాదించాలని గాజుల మహోత్సవం పూజలు నిర్వహించినట్లు వివరించారు. పూజల వలన సకల అష్టైశ్వ ర్యాలు, ఆయురారోగ్యాలు కలిగి ఉంటారన్నారు. పట్టణ పరిసర ప్రాంతాల మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి గాజుల పూజ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి సేవలో తరించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాదం చేపట్టారు.