సూర్యాపేటలో శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
- చిన్న పిల్లలను అమ్ముతున్న ముఠా అరెస్ట్..
- నిందితుల్లో ఆరుగురు మహిళలు.. నలుగురు పురుషులు
- హైదరాబాద్, సూర్యాపేట, విజయవాడ వాసులే నిందితులు
- ఒక్కో శిశువుకు రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షలు
హైదరాబాద్: సూర్యాపేట(Suryapet) జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. చిన్నారులను విక్రయిస్తున్న ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా వద్ద నుంచి 16 నెలల మగశిశువును పోలీసులు గుర్తించారు. శిశువును చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు(Child Welfare Officers) అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే 22 మంది శిశువులను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుంచి శిశువులను తీసుకువస్తున్నట్లు పోలీసుల విచారణ వెల్లడైంది. ఒక్కో శిశువును రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షలకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో హైదరాబాద్, సూర్యాపేట, విజయవాడ వాసులు ఉన్నారు. నిందితులపై గతంలోనూ శిశు విక్రయాల కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.






