24-05-2025 07:47:09 PM
లక్షలాది ఏకరాల భూమిని పేదలకు పంచిన ఘనత గిరిప్రసాద్..
నేటితరం కమ్యూనిస్టులకు గిరిప్రసాద్ ఆదర్శం..
సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా..
సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా నల్లమల 29వ వర్ధంతి..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కార్మిక, కర్షక, పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నల్లమల గిరిప్రసాద్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని, భూపోరాటాలకు నాయకత్వం వహించి లక్షలాది ఎకరాలను పేదలకు పంచిన ఘనత గిరిప్రసాదుకు దక్కుతుందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా(CPI Secretary SK Sabir Pasha) అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సిపిఐ మాజీ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు నల్లమల గిరిప్రసాద్ 29వ వర్ధంతి శనివారం శేషగిరిభవన్లో ఘనంగా నిర్వహించారు.
అనంతరం జరిగిన సమావేశంలో సాబీర్ పాషా మాట్లాడుతూ... అప్పటి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ దృవతారగా వెలుగొందిన గిరిప్రసాద్ జీవితం, ఆయన చేసిన త్యాగం నేటి తరం కార్యకర్తలకు, నాయకులకు స్పూర్తిదాయకమని అన్నారు. నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేఖంగా ఆంధ్ర మహాసభ సాగించిన ఉద్యమం గురించి అద్యయనం చేసి ఉన్నత విద్యను, ఆస్తులను సైతం వదిలివేసి ఉద్యమబాట పట్టిన నల్లమల సాయుధ పోరాటాన్ని బలోపేతం చేశాడని కొనియాడారు. కమ్యూనిస్టు ఉద్యమాలను నడిపించడంలో కీలకపాత్ర పోషించిన గిరిప్రసాద్ లేని లోటును పరిపూర్త చేయాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు కొరిమి రాజ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, జిల్లా సమితి సభ్యులు కంచర్ల జమలయ్య, జి వీరాస్వామి, భూక్యా శ్రీనివాస్, కేశవరావు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.