19-12-2025 07:20:42 PM
జిల్లా కో-ఆర్డినేటర్ చైతన్య
తుంగతుర్తి,(విజయ క్రాంతి): మహిళా శిశు సంక్షేమ శాఖలోని, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో 'బేటీ బచావో - బేటీ పడావో' పథకంలో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల లో శుక్రవారం బాలికా చైతన్యo అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆర్డినేటర్ చైతన్య మాట్లాడుతూ.. బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. సమాజంలో బాలికల పట్ల ఉన్న వివక్షను రూపుమాపడమే 'బేటీ బచావో - బేటీ పడావో' ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
సందేశంలోని ముఖ్యాంశాలు: విద్యే ఆయుధం: ప్రతి బాలిక ఉన్నత చదువులు చదివి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఆర్థిక స్వాలంబన సాధించినప్పుడే మహిళలకు గౌరవం లభిస్తుంది.
చట్టాలపై అవగాహన: బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టం, మరియు మహిళా రక్షణ చట్టాల పట్ల ప్రతి విద్యార్థిని అవగాహన కలిగి ఉండాలి.
ప్రభుత్వ ప్రోత్సాహం: ప్రభుత్వం బాలికల విద్య కోసం అందిస్తున్న రాయితీలు, వసతులను సద్వినియోగం చేసుకోవాలి.
ఆరోగ్యం మరియు పరిశుభ్రత: చదువుతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారం పట్ల శ్రద్ధ వహించాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ వో కల్పన, మహిళా శిశు సంక్షేమ శాఖ జెండర్ స్పెషలిస్ట్ వినోద్, భవ్య మరియు తదితరులు పాల్గొన్నారు.