calender_icon.png 13 June, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవుడిభూమి కబ్జా!

12-06-2025 01:26:12 AM

ఓ పార్టీ నేతల అండతో దర్జాగా అక్రమ నిర్మాణాలు

ఫలక్‌నుమా పంచలింగాలస్వామి ఆలయ భూమికి ఎసరు

  1. 50 ఏండ్లుగా ఇష్టారాజ్యం 
  2. కోట్ల విలువజేసే 3.14ఎకరాల భూమి అన్యాక్రాంతం 
  3. ఆలయ భూమికి పత్రాలున్నా పట్టించుకోని అధికారులు
  4. ఆక్రమణలపై పోరాడుతున్న రాష్ట్రీయ వానరసేన 
  5. ఆలయ భూమిని కాపాడాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీలత 
  6. న్యాయం జరగకపోతే ఉద్యమిస్తామని మాధవీలత, వానరసేన హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): హైదరాబాద్ నడిబొడ్డున కోట్ల రూపాయల విలువజేసే ఆలయభూమి కబ్జాకోరల్లో చిక్కుకుంది. ఓ రాజకీయపార్టీ మద్దతుతో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా పట్టించుకున్న నాథు డు లేడు. బండ్లగూడ మండలం ఫలక్‌నుమా, సుల్తాన్‌బాగ్‌లోని శ్రీపంచలింగాల స్వామి దేవాలయ భూమి ఐదు దశాబ్దాలుగా ఆక్రమణలకు గురవుతోంది.

ఆల య భూములను కాపాడాల్సిన అధికారులు చేతులెత్తేయడంతో కబ్జారాయుళ్ల భూదాహానికి అంతేలేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా ఇంటి నిర్మాణాలు చేపడుతుండటంతో కోట్ల విలువైన ఆలయ భూమి అన్యాక్రాంతమవుతోంది. శ్రీపంచలింగాల స్వామి దేవాలయం సర్వే నంబర్ 6లో 3 ఎకరాల 14 గుంటల విస్తీర్ణంలో ఉంది. 1959-60 నాటి రికార్డుల్లో ఈ భూమి ఆలయానికి చెందినదిగా నమోదైనప్పటికీ, ఆక్రమణదారులు బోర్‌వెల్ తవ్వడం, నిర్మాణాలు చేపట్టడం వంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. 

 గత 50 ఏండ్లుగా ఆక్రమణలు కొనసాగుతూనే ఉండటం గమనా ర్హం. ఈ ఆక్రమణలకు బహదూర్‌పుర ఎమ్మెల్యే, శాలిబండ కార్పొరేటర్ రాజకీయ మద్దతు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలయ భూమిని రక్షించాలని రాష్ట్రీయ వానరసేన ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఎండోమెంట్స్ కమిషనర్, ప్రజావాణి ఫోరమ్‌లతోపాటు గవర్నర్, సీఎం, చీఫ్ సెక్రటరీ, ఎండోమెంట్స్ మంత్రు లకు వివిధ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 

2011కోర్టు తీర్పు ప్రకారం సయ్యద్ ఖాజా మౌసుద్దీన్‌ను భూకబ్జాదారుగా ప్రకటించి, రెండు నెలల్లో భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించినప్పటికీ, అమలు కాలేదు. ప్రభు త్వం దశాబ్దాలుగా ఈ ఆలయ భూమిని కాపాడడంలో విఫలమైంది. 

కబ్జాదారులపై కలెక్టర్ జాలెందుకో: బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీలత

శ్రీపంచలింగాల స్వామి దేవాలయ భూమిని ఆక్రమణల నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తూ బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత, రాష్ట్రీయ వానరసేన సంయుక్తంగా గత సోమవారం హైదరాబాద్ కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. కలెక్టర్ ఆక్రమణదారులపై జాలిచూపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

‘మూడు వారాల్లో ఆలయ భూమి ఆక్రమణల నుంచి విముక్తి లభించకపోతే, పెద్దఎత్తున ఉద్యమం చేపడతాం..ఆలయ పరిధిలోని 3 ఎకరాల 14 గుంటల భూమిని కబ్జాదారులు ఆక్రమించి ఇండ్లు కట్టుకున్నారు. రాష్ట్రీయ వానరసేన 15 ఏండ్లుగా ఈ ఆక్రమణలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. కానీ, కలెక్టర్ కబ్జాదారులపై జాలి చూపడం విడ్డూరంగా ఉంది.’ అని మండిపడ్డారు.  ‘50 ఏండ్లుగా ఇండ్లు కట్టుకున్న వారి జీవనోపాధి ఏమవుతుంది?’ అని బాధ్యతగల కలెక్టర్ ప్రశ్నించడం సరికాదన్నారు. 

కబ్జాదారులపై చూపే ప్రేమ, ఆలయం వెనుక నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చూపడం లేదన్నారు.  ‘కలెక్టర్ కబ్జాదారులకు మద్దతుగా మాట్లాడటం మానుకొని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి. ఆ భూమిని తక్షణం ఆలయానికి అప్పగించాలి. మూడు వారాల గడువు ఇచ్చాం. మళ్లీ నేను వస్తాను, న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు.. ఈ పోరాటం కేవలం భూమి కోసమే కాదు, హిందూ ధర్మం, సం స్కృతి, విశ్వాసాల సంకేతం.

దీనిని కాపాడటం మా బాధ్యత. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే, ప్రజలు రోడ్డెక్కి న్యాయం కోసం ఉద్యమిస్తారు..’ అని హెచ్చరించారు. రాష్ట్రీయ వానరసేన జాతీయ అధ్యక్షుడు నామ్ రామ్ రెడ్డి మాట్లాడుతూ..కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ రికార్డుల ప్రకారం దేవాలయ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 

సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు

 ఆలయ భూమి ఆక్రమణ సమస్యను పరిశీలించి, తగిన చర్య లు తీసుకోవడానికి మూడు వారాల సమయం అవసరం. ఈ వ్యవధిలో ఆక్రమణలపై న్యాయపరమైన రికార్డులను సమీక్షించి, తదుపరి చర్యలు నిర్ణయిస్తాం. ఈ సమయంలో సమగ్ర దర్యాప్తు జరిపి, ఆలయ భూమి హక్కులను కాపాడేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

 హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్