12-06-2025 01:26:27 AM
ములుగు, జూన్ 11 (విజయక్రాంతి)/ వెంకటపూర్: అంగన్వాడీ కేంద్రాలు పిల్లలతో కళకళలాడాలని, ఎలాంటి ఒత్తిడిలేని ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను చిన్నారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న అమ్మ మాట బాట ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ములుగు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని వెంకటాపూర్ మండలంలోని నల్లగుంట గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, జిల్లా సంక్షేమ అధికారి తుల రవి అధ్యక్షతన మంత్రి సీతక్క ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సామాన్యుడికి విద్య అందని ద్రాక్షలా ఉండకూడదని, రాష్ట్రంలో 3 సంవత్సరాలు నిండిన ప్రతీ బిడ్డ ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసించాలనే గొప్ప లక్ష్యం తో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.
చదువంటే బరువులు మోసే యంత్రాల్లా పిల్లలను మార్చడం కాదని, బాధ్యత కల్గిన పౌరులుగా ఎదిగేలా వారిని తీర్చిదిద్దడమని అన్నారు. నేటి సమాజంలో చదువుల పేరు మీద పిల్లలపై ఎన్నో విధాలుగా ఒత్తిడి పెరుగుతుందని,
దాని కారణంగా వారు ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇలాంటి ఇబ్బందులకు దూరంగా పిల్లకు ఆహ్లాదకరంగా ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందించడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.