28-12-2025 11:20:36 AM
హాజీపూర్: బీహార్లోని హాజీపూర్లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ సెక్షన్లోని అప్, డౌన్ లైన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూర్పు మధ్య రైల్వే సీపీఆర్ఓను ప్రస్తావిస్తూ ఏఎన్ఐ తెలిపిన వివరాల ప్రకారం... ఈస్టర్న్ రైల్వేలోని అసన్సోల్ డివిజన్ పరిధిలో లహబన్, సిముల్తలా స్టేషన్ల మధ్య శనివారం రాత్రి 11:25 గంటలకు జరిగింది. లహాబన్-సిముల్తాన్ మధ్య గూడ్స్ రైలులోని 8 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. సమాచారం అందిన వెంటనే అసన్సోల్, మధుపూర్, ఝాఝా నుండి ప్రమాద సహాయక రైలు (ART) బృందాలను సంఘటనా స్థలానికి తక్షణమే పంపామని, ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
డిసెంబర్ 16న జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో ఉన్న గువాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) సైడింగ్లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలోని సెయిల్ గనులకు ఇనుప ఖనిజాన్ని తీసుకువెళ్లే సరుకు రవాణా రైళ్ల రాకపోకలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. చక్రధర్పూర్లోని సౌత్ ఈస్టర్న్ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఆదిత్య కుమార్ చౌదరి ప్రకారం... ఇనుప ఖనిజాన్ని లోడింగ్, అన్లోడింగ్ చేయడానికి ఉపయోగించే సైడింగ్లో రైలుకు చెందిన ఒక బోగీ పట్టాలు తప్పినట్లు సమాచారం.
ఈ ఘటన జరిగిన ప్రదేశం సెయిల్ (SAIL) ఆధీనంలో ఉందని, రైల్వే సాంకేతిక బృందం సహాయంతో సెయిల్ అధికారులు లైన్ను పునరుద్ధరించారని ఆయన తెలిపారు. ఈ రైలు పట్టాలు తప్పిన సంఘటన ప్రధాన రైల్వే మార్గంలో నడుస్తున్న రైళ్లపై ఎటువంటి ప్రభావం చూపలేదని అధికారులు ధృవీకరించారు. సెయిల్ (SAIL) పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని గువా, కిరిబురు, మనోహర్పూర్ (చిరియా) మరియు మేఘాహతుబురు వద్ద నాలుగు ఇనుప ఖనిజ గనులను నిర్వహిస్తోంది.