ప్రభుత్వ భూములను పరిరక్షించాలి
మందమర్రి (విజయక్రాంతి): ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని బహుజన్ సమాజ్ పార్టీ(Bahujan Samaj Party) జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం నస్పూర్ లో గల జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రభుత్వ భూములు కాపాడాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... మండలంలోని అందుగులపేట గ్రామపంచాయతీ పరిధిలోని మందమర్రి శివారు సర్వేనెంబర్ 364 లో గల ఎకరం 30 గుంటల భూమిని ఊర చెరువు అభివృద్ధి కోసం, రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన, భూమి కబ్జాకు గురవుతుందని అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు.






