calender_icon.png 20 June, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం

20-06-2025 12:54:58 AM

జయశంకర్ భూపాలపల్లి, (మహబూబాబాద్) జూన్ 19 (విజయక్రాంతి): దివ్యాంగులకు రాష్ట్ర లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం మాతా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఆలింకో సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల సమాజం వివక్ష చూపకూడదని, వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించే విధంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కొంత కోటా కేటాయించడానికి ప్రభుత్వంతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 204 మందికి 21 రకాలకు సంబంధించిన ఉపకారణాలను అందజేస్తున్నట్లు చెప్పారు.

ఇందిరమ్మ అమృతం పథకంలో భాగంగా జిల్లాలో 14 నుండి 18 సంవత్సరాల వయసు గల కిషోర బాలికలను గుర్తించి వారిలో రక్తహీనత నుంచి కాపాడి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి నెలకు రెండు పర్యాయాలు పౌష్టికాహారం మిల్లెట్, పల్లి పట్టీలు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డి డబ్ల్యు ఓ మల్లేశ్వరి, ఆలింకో ప్రతినిధి రష్మీ రాజన్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.