అకాల వర్షంతో తడిసిన ధాన్యం
24-04-2026 12:30 AM
ఆదుకోవాలని ప్రభుత్వానికి రైతుల విజ్ఞప్తి
తంగళ్ళపల్లి,ఏప్రిల్ 23 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో అకాల వర్షం కారణంగా రైతులు ఎండబోసిన వడ్లు తడిసిపోయాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దగా మారి నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటను ఎండబోసి కొనుగోలుకు సిద్ధం చేసిన సమయంలో వర్షం కురవడంతో వడ్లు నాణ్యత కోల్పోయాయని, మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు.ఈ నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.రైతుల పక్షాన ప్రభుత్వం వెంటనే స్పందించి, తడిసిన వడ్లను ప్రత్యేకంగా కొనుగోలు చేసి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.






