రాష్ట్ర పండుగగా వాసవీ మాత జయంతి
సీఎం రేవంత్ రెడ్డికి ఉప్పల శ్రీనివాస్ గుప్త ధన్యవాదాలు
హైదరాబాద్, ఏప్రిల్ 23(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం వాసవీ మాత జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించడం పట్ల ఆర్యవైశ్య సమాజం హర్షం వ్యక్తం చేస్తోందని పీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త పేర్కొన్నారు.
ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్య వైశ్యుల తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాసవి మాత జయంతి అనేది ఆర్యవైశ్యుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని అన్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున జరుపుకునే ఈ జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం ద్వారా ప్రభుత్వం ఆర్యవైశ్యుల భావోద్వేగాలను గౌరవించినట్టయిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం, వాసవి మాత జయంతి రోజున రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం ఎంతో అభినందనీయమని తెలిపారు.ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు వాసవీ మాత జయంతి ఉత్సవాలు మరింత భక్తి, శ్రద్ధలతో నిర్వహించబడతాయని అన్నారు.






