పేదల పెన్నిధి ఎన్టీఆర్
ఫరూక్ నగర్ మండల మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర రెడ్డి
షాద్ నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి
షాద్నగర్ జనవరి 18, (విజయక్రాంతి): కారణజన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి, ‘అన్న’ నందమూరి తారక రామారావు అని టిడిపి సీనియర్ నేత, ఫరూక్ నగర్ మండల మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఆదివారం షాద్ నగర్ చౌరస్తాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన కథానాయకుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావనీ పేర్కొన్నారు. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడని అభివర్ణించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతఃస్మరణీయుడన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శమని తెలిపారు. ఆయన వేసిన బాట అనుసరణీయని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గంధం ఆనంద్, తదితర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




