20-05-2025 12:45:52 PM
వధువుకు గాయాలు
మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం(Bayyaram Mandal) కోడిపుంజుల తండాలో విద్యుత్ షాక్తో వరుడు మృతిచెందగా, వధువు గాయపడింది. కోడిపుంజుల తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్కు, విజయవాడకు చెందిన జాహ్నవితో ఈనెల 18న విజయవాడలో వివాహం జరిగింది. నూతన జంట వరుడి స్వగ్రామానికి చేరుకున్నారు. మంగళవారం రిసెప్షన్ విందు కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం ఇంట్లోని బోరు మోటరు కోసం విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా నరేశ్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. జాహ్నవి కూడా గాయపడింది. వెంటనే ఆమెను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పెండ్లి వేడుక సందర్భంగా బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఈ ఘటనతో విషాదంలో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బయ్యార ఎస్సై తిరుపతి తెలిపారు.