20-05-2025 06:32:25 PM
హర్యానా,(విజయక్రాంతి): అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమూదాబాద్కు సోనెపట్ జిల్లా కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆపరేషన్ సిందూర్ పై ఫేస్బుక్ వివాదాస్పద ఆరోపణలు చేసిన ఖాన్ ను హర్యానాలోని సోనిపట్ పోలీసులు అరెస్టు చేశారు. అతని ఇంటికి వచ్చి ప్రొఫెసర్ అలీ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు తర్వాత రెండు రోజులు పోలీసు కస్టడీలో గడిపిన తర్వాత సోనెపట్లోని జిల్లా కోర్టు హాజరుపర్చి పోలీసులు అతని రిమాండ్ను ఏడు రోజులు పొడిగించాలని కోరారు. పోలీసుల అభ్యర్థనను స్థానిక కోర్టు తిరస్కరించి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 27వ తేదీకి వాయిదా వేసింది.
అలీ ఖాన్ మహమూదాబాద్ హర్యానాలోని అశోక విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ ఘర్షణలు, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశం గురించి సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ అలీ ఖాన్ పై హర్యానాలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) యువ మోర్చా ప్రధాన కార్యదర్శి యోగేష్ సోనిపట్ పోలీసులకు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆదివారంఅరెస్ట్ చేశారు.
సాయుధ తిరుగుబాటు లేదా విధ్వంసక కార్యకలాపాలను ప్రేరేపించడం, మత విశ్వాసాలను అవమానించడం, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్ల కింద ఖాన్పై కేసు నమోదు చేశారు.అలీ ఖాన్ అరెస్టుపై చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు.