calender_icon.png 24 August, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా లేదు కానీ.. ఏ ఊరికి పోయిన బెల్ట్ షాపులు మస్తు ఉన్నాయి

24-08-2025 01:24:28 PM

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) ఆదివారం పర్యటించారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఇద్దరు యువకులు డెంగ్యూతో మరణించిన వారి కుటుంబాలను హరీష్ రావు పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. తిమ్మాపూర్ గ్రామంలో కొనతం మహేష్(34) న్యాయని శ్రావణ్ కుమార్(16) డెంగ్యూతో మరణించడం బాధాకరమని తెలిపారు. ఈ గ్రామంలో దాదాపు 60 కుటుంబాలు డెంగ్యూతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, అనేకమంది ప్రైవేట్ ఆస్పత్రిలో డబ్బులు పెట్టి వైద్యం చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్(KCR) ప్రభుత్వంలో పల్లె ప్రగతి కార్యక్రమం చేసి ఊరురా ట్రాక్టర్ ట్రాలీ ఇచ్చి ప్రతి నెల గ్రామపంచాయతీకి నిధులు ఇచ్చేదని గుర్తు చేశారు. నేడు పంచాయతీ సెక్రెటరీలు అప్పులపాలై సమ్మె ప్రకటించే పరిస్థితి వచ్చిందని, గ్రామపంచాయతీ వర్కర్లకు జీతాలు రావడం లేదని అన్నారు. 

గ్రామపంచాయతీలో దోమలకు స్ప్రే చేద్దామన్నా, బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నా డబ్బులు లేవని అన్నారు. ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవని, చెత్త సేకరణ కూడా జరగడం లేదని ఆరోపించారు. గ్రామాలంతా అయోమయం, గందరగోళం అయిపోయాయని, ఊర్లకు ఊర్లు మంచాన పడుతున్నాయన్నారు. వైరల్ ఫీవర్‌లకే అప్పులపాలయి లక్షల రూపాయలను ప్రజలు ఖర్చు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోయి, వైద్యం కరువైపోయి ప్రైవేట్‌ లో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ.. ఎక్కడైనా ముఖ్యమంత్రి పర్యటించారా..? కనీసం పారిశుద్ధ్యంపై సమీక్ష నిర్వహించారా..? అని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దోమలు రాకుండా రాష్ట్రమంతా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిందని, పల్లెల్లో ప్రజలు.. హాస్టళ్లలో విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని.. రైతులు రోడ్లపై పడ్డారని.. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలన్నారు. 

గ్రామపంచాయతీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విష జ్వరాలు రాకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. పట్టణాల్లో, గ్రామాల్లో కనీసం మోరీలు బాగుచేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదని తెలిపారు. గ్రామ పంచాయతీల నిర్వహణపై చర్చకు ప్రభుత్వం సిద్ధమా అని నేను అడుగుతున్నాను.. కేసీఆర్ ఉన్నప్పుడు నెలకి 300 కోట్లు గ్రామపంచాయతీలకు ఇచ్చేవారు.. రేవంత్ రెడ్డి కనీసం పది పైసలైన ఇచ్చాడా..? అని విమర్శించారు. మీ ఇంటలిజెన్స్ నెట్వర్క్ ఏం చేస్తున్నది.. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడమే తప్ప ప్రజల ఇబ్బందులను మీకు చెప్పడం లేదా.. నీ పాలన ఎంతసేపు ప్రతిపక్షాలపై కుట్రలు, కేసీఆర్ ని ఇబ్బందులు పెట్టడమే తప్ప నువ్వు చేసింది ఏముంది.. అని ఆయన అన్నారు. యూరియా బస్తాల కోసం రైతులు మబ్బుల మూడు గంటలకు క్యూలో నిలబడే పరిస్థితి వచ్చిందని, యూరియా బస్తాలు దొరకడం లేదు కానీ ఏ ఊరికి పోయినా బెల్ట్ షాపులు మస్తు ఉన్నాయన్నారు.. మందు మాత్రం ఫుల్లు యూరియా మాత్రం నిల్లు.. అని, మండలంకు వైన్ షాపు, బార్ షాపు పెడతాడట కానీ దావఖానలో ప్రజలకు మందులు లేవు రైతులకు యూరియా సంచులు లేవు అని తీవ్రంగా ధ్వజమెత్తారు. 

తులం బంగారం దేవుడెరుగు కానీ యూరియా బస్తాలే బంగారం అయ్యాయని, ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 26 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెచ్చి స్టాక్ పెట్టాం.. ఇప్పుడు కనీసం 3,000 మెట్రిక్ టన్నులు కూడా రాలేదని అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఊరికే లారీలు వచ్చేదని, యూరియాని అక్కడే అందించే వాళ్ళమని, రేవంత్ పాలన రైతులకు కాలరాత్రులను మిగిల్చిందన్నారు. యూరియా కోసం జాగారాలు చేసే పరిస్థితి ఏర్పడిందని, ఒక యూరియా బస్తా దొరికితే లాటరీ దొరికినట్టు అనుకునే పరిస్థితి వచ్చిందన్నారు. డెంగ్యూతో మరణించిన యువకుల తల్లిదండ్రుల కడుపుకోతకు ఎవరు బాధ్యులు.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యువకులైన మహేష్, శ్రావణ్ చనిపోయారు.. శ్రావణ్, మహేష్ మరణాలు ఈ ప్రభుత్వ హత్యలు.. ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం వల్లే చనిపోయారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పాడు రేవంత్ రెడ్డికి తిట్లు తప్ప పరిపాలన చాతకావడం లేదు అని.. తిట్టుడు బందు పెట్టి పాలనపై దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి.. లేకపోతే జనాలు తిరగబడతారు జాగ్రత్త.. అని హరీష్ రావు తెలిపారు.