24-08-2025 07:24:17 PM
చీకట్లో కుక్కల దాడులతో వణికే ప్రయాణికులు
పట్టించుకోని పంచాయతీ అధికారులు నిర్లక్ష్య వైఖరి రాత్రిపూట భయం భయం
కుభీర్,(విజయక్రాంతి): కుభీర్ మండలంలోని వివేకానంద చౌరస్తా వద్ద హై మాస్ట్ లైట్స్ లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చౌరస్తా చీకటిలో మునిగిపోవడం వల్ల రోడ్డు మీదుగా వెళ్ళే వాహనదారులు, బస్సుల నుండి దిగే ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. చీకటి కారణంగా వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రయాణికులను వెంబడించడం, దాడి చేసే పరిస్థితులు తరచుగా కనిపిస్తున్నాయి. స్థానిక ప్రజలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఇప్పటికీ లైటింగ్ సమస్య పరిష్కారం కాలేదు. ప్రజలు అధికారులకు తక్షణమే హై మాస్ట్ లైట్స్ ఏర్పాటు చేసి, ప్రజా భద్రతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.