24-11-2025 05:19:51 PM
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్
వనపర్తి క్రైమ్: కుటుంబ నియంత్రణ పాటించడంలో పురుషులు వ్యాసెక్టమి శస్త్ర చికిత్స చేయించుకొని సంతోషకరమైన కుటుంబాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్ సూచించారు. సోమవారం ప్రజావాణి హాల్లో వ్యాసెక్టమి అవగాహన, శస్త్ర చికిత్స పక్షోత్సవాలపై లైన్ డిపార్ట్మెంట్ లతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నవంబర్ 21 నుండి డిసెంబర్ 4 వరకు నిర్వహించే వ్యాసెక్టమి అవగాహన, శస్త్ర చికిత్సలపై లైన్ డిపార్ట్మెంట్ లు సమన్వయంతో పనిచేసి పురుషుల్లో ఉన్న అనుమానాలను తొలగించి వ్యాసెక్టమిపై అవగాహన కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ విధానంలో మహిళలకు నిర్వహించే ట్యూబెక్టమి శస్త్ర చికిత్సలో కోతలు నిర్వహించి కుట్లు వేస్తారని, వారం పది రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అదే పురుషులకు నిర్వహించే వ్యాసెక్టమిలో ఎలాంటి కోతలు కుట్లు ఉండవని, కేవలం అర గంటలో శస్త్ర చికిత్స పూర్తి అయిపోతుందన్నారు. గంట సేపట్లో ఇంటికి వెళ్ళిపోవచ్చని ఎలాంటి ఇతర సైడ్ ఎఫెక్ట్ లు ఉండవన్నారు.
వ్యాసెక్టమిపై చాలామంది పురుషుల్లో ఒక అపోహ ఉందని, శస్త్రచికిత్స అనంతరం విడివాహిక సంబంధంలో ఇబ్బందులు వస్తాయేమో అని కానీ నియంత్రణ అనేది ఫెర్టిలిటీకి మాత్రమే కానీ పోటెన్షియల్ కు కాదని స్పష్టం చేశారు. పురుషులు ఎలాంటి అపోహలు పడవద్దని, శస్త్ర చికిత్స అనంతరం తన భాగస్వామితో హాయిగా వైవాహిక జీవితం గడుపుకోవచ్చని తెలియజేశారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, డిప్యూటీ కలెక్టర్ (ప్రొబేషన్) శ్రావ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.