24-11-2025 04:55:51 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో గల డబుల్ బెడ్ రూమ్ గృహాల్లో అనర్హులను తొలగించి అర్హులకు ఇల్లు కేటాయించే విషయంలో సమస్యను త్వరగా తేల్చాలని కోరుతూ సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, ఎంసిపిఐ(యు) డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ లో వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు ఆ సంఘాల నాయకులు సునారికారి రాజేష్, అల్లెపు పీటర్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ గృహాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లను కేటాయించారని గత కొన్ని నెలలుగా అధికారుల దృష్టికి రాతపూర్వకంగా తీసుకువచ్చినప్పటికీ సమస్యను తేల్చకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా నిజమైన అర్హులకు లబ్ధి చేరకుండా చేస్తున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి అధికారులు అర్హులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. అర్హులకు కాకుండా అనర్హులకు ఇండ్లను కేటాయించడం శోచనీయమని, ఈ సమస్య తొందరగా పరిష్కారం చేసి నిరుపేదలకు ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, తోటరాద ,కమల, గౌస్, షాదుల్లా, తదితరులు ఉన్నారు.