17-09-2025 06:36:07 PM
సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
వలిగొండ,(విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటా చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి పార్టీని తిప్పి కొట్టాలని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. వలిగొండ మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా పార్టీ నూతన ఆఫీస్ వద్ద ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాలు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పీడిత, వ్యవసాయ కూలీలు, కార్మికులు అనేకమంది ఈ పోరాటంలో నైజాముకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది.
భూమికోసం ,భుక్తి కోసం జరిగిన పోరాటంలో 4500 మంది ప్రాణాలు అర్పించారని 3000 గ్రామాలు గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసుకొని గ్రామాలను కాపాడుకోవడం జరిగిందన్నారు. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన కమ్యూనిస్టు యోధులు అని అన్నారు. బిజెపి ప్రభుత్వం స్వాతంత్ర పోరాటంలో గాని,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోగాని ఎక్కడ కూడా ఇసుమంత పోరాటంలో పాల్గొనని దాఖలాలు కూడా లేని పార్టీ బీజేపీ మతానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో వలిగొండ ప్రాంతం కూడా ఒక పోరాట కేంద్రంగా పనిచేసిందని నైజాం నవాబు రజాకారులకు వ్యతిరేకంగా వేములకొండ, అరూరు, పులిగిల్ల, సుంకిషాల అనేక గ్రామాలలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన కమ్యూనిస్టు పార్టీ అగ్ర భాగాన నిలిచిందని అన్నారు.