13-06-2025 11:26:29 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): రైతులు వ్యవసాయం ద్వారా మంచి లాభాలు సంపాదించేందుకు ఎప్పుడూ పండించే సాధారణ పంటలు కాకుండా, ఉద్యాన, వాణిజ్య పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఈ పంటల వల్ల అధిక దిగుబడి, ఆదాయం వస్తుందని అన్నారు.ముఖ్యంగా ఇటీవలి కాలంలో పలువురు రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారని, నల్గొండ జిల్లాలో విభిన్న పంటలను పండించి అధిక ఆదాయం ఆర్జిస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా, తిప్పర్తి మండలం,అంతాయ గూడెం లో రైతు కమలాకర్ రెడ్డి సాగు చేస్తున్న "అంజీర"తోటను పరిశీలించారు.
అంజీర ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారని? పండిన పంటను ఎక్కడ అమ్ముతున్నారని? మార్కెట్ ఉందా? నీటి సౌకర్యం ఉందా? ఫామ్ పాండు ఏమైనా నిర్మించుకున్నారా ? బ్రాండింగ్ ,మార్కెటింగ్ ,తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తొమ్మిది ఎకరాలలో అంజీర సాగు చేశామని, ప్రస్తుతం ఇది మొదటి పంట అని, 15 నెలలు అవుతున్నదని, ఈ జనవరి నుండి దిగుబడి మొదలయిందని, ఒక ఎకరాకు రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని, డ్రిప్ పద్ధతిలో నీళ్లు అందిస్తున్నామని, ప్రస్తుతం ఎకరాకు నాలుగు టన్నుల దిగుబడి వస్తున్నదని, సరాసరి ఎకరాకు లక్ష ఇరవై వేల రూపాయల లాభం వస్తున్నదని ,స్థానిక మార్కెట్ తోపాటు, చెన్నై, బెంగళూరు వంటి పట్టణాలకు పంపిస్తున్నామని, గతంలో వాటర్ మిలన్, బొప్పాయి,వంకాయ వంటి పంటలు పండించడం జరిగిందని, ఇప్పుడు వాటికి బదులుగా అంజీర తోటను పెంచుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... అంజీర కు బ్రాండింగ్ చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ,అలాగే మార్కెటింగ్ లో సహాయం చేసే అంశం, స్థానిక స్వయం సహాయక మహిళా సంఘాల సహకారంతో వీలైతే ఒక రైతు ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించి దాని ద్వారా మార్కెటింగ్ కు చర్యలు తీసుకోవాలని ,ప్యాకింగ్ హౌస్ కు ఆర్థిక సహాయం అందించే విషయం పరిశీలించాలని ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డిని ఆదేశించారు. జిల్లాలో అంజీర తోపాటు, ఇతర ఉద్యాన పంటలు, పప్పుధాన్యాలు పండిస్తున్న రైతుల పంటలకు బ్రాండింగ్ కల్పించే విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాలని, స్వయం సహాయక బృందాలతో అనుసంధానం చేసుకుని రైతులకు మంచి ధర వచ్చేలా, మార్కెటింగ్ లభించే విధంగా లేబులింగ్ చేసి పంపించేలా ఉన్న అవకాశాలు అన్నింటిని పరిశీలించాల్సిందిగా ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతు కమలాకర్ రెడ్డి సుగుణమ్మ దంపతులను శాలువాతో సన్మానించారు. వారు పండిస్తున్న అంజీర తోట బాగుందని, వీరిని చూసి ఇతర రైతులు కూడా ముందుకు రావాలని ఉద్యాన శాఖ ద్వారా డ్రిప్, మొక్కలకు సబ్సిడీపై ఆర్థిక సహాయం అందించేందుకు అవకాశాలు ఉన్నాయని ,వీటిని రైతులు సద్వినియోగం చేసుకొని ఉద్యాన, వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని ,వీటి ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ఆమె వెంట జిల్లా ఉద్యానశాఖ అధికారి అనంత రెడ్డి,తహసిల్దార్ పరశురాం,ఇతర అధికారులు,తదితరులు ఉన్నారు.