23-01-2026 12:47:05 AM
ఆదిలాబాద్/కుమ్రంభీం ఆసిఫాబాద్/జైనూర్, జనవరి 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రావాలనే లక్ష్యంతో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తనతో పాటు నడిచిన ప్రజలకు, వారు ఇచ్చిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలిపేందుకే తిరిగి వచ్చానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజుల పర్యటన సందర్భంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దేవ్గూడ, ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జాంగాం, బూసి మెట్ట, కెరమెరి మోడీ గ్రామాల్లో పర్యటించారు.
గ్రామస్థులతో ముఖాముఖి కార్య క్రమాల్లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. పీపు ల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ప్రజలు వ్యక్తపరిచిన సమస్యలను వివరంగా నమోదు చేసుకున్నానని, అవే అంశాలను బడ్జెట్లో పొందుపరిచి పరిష్కరిస్తున్నామని తెలిపారు. బడ్జెట్ రూపొందించే సమయంలో పాదయాత్రలో చూసిన, విన్న ప్రజల కష్టాలు తీరేలా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా దేవుగూడలో తన పాదయాత్రలో భోజనం పెట్టి, తనతో పాటు నడిచిన గంగుబాయి, లక్ష్మీబాయి కుటుంబాలను హైదరాబాద్ ప్రజాభవన్కు భోజనానికి ఆహ్వానించారు. కార్యక్రమాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, ట్రైకార్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్, జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఎంపీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, కలెక్టర్లు కె. హరిత, రాజర్షి షా, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఉన్నారు.