8 May, 2026 | 1:04 AM

జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

08-05-2026 12:00 AM

విరాహత్ ఆలీ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఆధ్యక్షుడు

మహబూబ్ నగర్ టౌన్ మే 7 : ప్రెస్ క్లబ్ ప్రతినిధులపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం సోషల్ మీడియా పోస్టులను సాకుగా చూపి జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టుల మధ్య ఉండాల్సిన ఆరోగ్యకరమైన సంబంధాలను ఇలాంటి కేసులు దెబ్బతీస్తాయని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

ఈ కేసులను వచ్చే నాలుగు రోజుల్లోగా ప్రభుత్వం  పోలీస్ యంత్రాంగం ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని విరాహత్ అలీ అల్టిమేటం జారీ చేశారు. ఈ అంశాన్ని రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డీజీపీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధు ఈ అక్రమ కేసుల వ్యవహారం పట్ల స్పందించాలని లేని పక్షంలో ప్రజాప్రతినిధుల ఇన్వాల్ మెంట్ ఉంది అని భావించాల్సి వస్తుందని అని అన్నారు. జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి అక్రమ కేసులను రద్దు చేయాలని, లేకపోతే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందించే ప్రక్రియ యుద్ధప్రాతిపదికన కొనసాగుతోందని, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందించామని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరిగితే యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి,కల్కూరి రాములు,హైమద్ పాష జిల్లా అధ్యక్ష్య ,కార్యదర్శులు కాటం నాగరాజు గౌడ్,సతీష్ రేడ్డి, తదితరులు పాల్గొన్నారు.