calender_icon.png 30 May, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు భూమిలో దర్జాగా నిర్మాణం

02-05-2025 07:25:44 PM

కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి మాయం

రెవెన్యూ అధికారుల సహకారంతోనేనని ఆరోపణ 

సర్వే చేసి చర్యలు తీసుకుంటాం: ఆర్‌ఐ భానుచందర్

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): ప్రభుత్వం మారినా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సర్కారు భూములు, చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత వాటిని కాపాడేందుకు హైడ్రాను తీసుకువచ్చినా కబ్జాలు ఆగడం లేదు. హైడ్రా అంటే ఏమాత్రం భయం లేకుండా పలు బడా నిర్మాణ సంస్థలు ప్రభుత్వ భూముల్లో దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా చూపించడం చూస్తే చాలు అధికారులు కబ్జాదారులకు ఎంత సహకరిస్తున్నారో అనేది తేటతెల్లం అవుతుంది.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి మండల పరిధిలోని నిజాంపేట్ డీమార్ట్ ఎదురుగా సర్వే నెంబర్ 332,334లో పావని నిర్మాణ సంస్థ ప్రభుత్వ భూమి కబ్జా చేసిందని ఆరోపణలు వెలువెతత్తుతున్నాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని దర్జాగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడాన్ని స్థానికులు విమర్శిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో సదరు సంస్థ ఎంచక్కా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.

సదరు నిర్మాణ సంస్థపై పలు ఆరోపణలు వస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని ఫిర్యాదులు చేసినా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఏం పట్టనట్టు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి ఇష్టాతీరిన కబ్జాదారులకు సహకరించడంపై అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలంలో చేస్తున్న నిర్మాణాలను తొలగించి, నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సర్వే చేసి చర్యలు తీసుకుంటాం : ఆర్‌ఐ, బాచుపల్లి

పావని నిర్మాణ సంస్థ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. అక్కడి నిర్మాణాలపై పైఅధికారులు సర్వే చేసిన తర్వాత, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.