అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టివేత
ఇందిరమ్మ ఇండ్లకు 10 శాతం రాయితీతో కలప అందజేత...
ఆదిలాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): ఇళ్లలో ఆక్రమంగా నిలువ ఉంచిన కలపను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం పక్కా సమాచారంతో గుడిహత్నూర్ మండలంలోని చింతగూడ గ్రామంలో ఇచ్చోడ అటవీ డివిజనల్ అధికారి చిన్న విశ్వనాథ బూసిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు.
గ్రామంలో కొంతమంది తమ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన కలప ను గుర్తించిన అటవీ అధికారులు వాటిని జప్తు చేసి, ప్రభుత్వ టింబర్ డిపో కు తరలించారు. అక్రమంగా కలప ను నిల్వ ఉంచిన వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని అటవీ డివిజనల్ అధికారి తెలిపారు. ఆక్రమంగా నిలువ ఉంచిన కలప విలువ రూ. 1 లక్ష 70 వేల వరకు ఉన్నట్లు వెల్లడించారు.
ఎవరైనా ఆక్రమంగా కలప నిలువ ఉంచినట్లయితే కఠిన చర్యలు ఉం టాయని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లు పథకంలో ఎవరికైనా కలప కావాల్సినట్లయితే ఇచ్చోడ ప్రభుత్వ కలప డిపో లో 10% రాయితీ కల్పిస్తున్నామన్నారు. పురాతన ఇంటి యొక్క కలప అయితే అటవీ డివిజనల్ అధికారి వద్ద తప్పకుండా అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఈ దాడిలో బోథ్ ఎఫ్ఆర్ఓ ప్రణయ్, డిప్యూటీ ఆర్ఓ ప్రవీణ్ మహాజన్, ఇబ్రహీం షరీఫ్, ఇమ్రాన్ పాల్గొన్నారు.




