02-12-2025 03:10:54 PM
-ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
- బోయినపల్లి మోడల్ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ
బోయినపల్లి,(విజయక్రాంతి): ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మోడల్ స్కూల్ లో మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు, విద్యాలయం ఆవరణ, మధ్యాహ్న భోజనం మెనూ, తయారీని పరిశీలించారు. మెనూ ప్రకారం ఈ రోజు ఏ ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని నిర్వాహకులకు సూచించారు.
7 వ తరగతి గదిలో ఇంగ్లీష్ పాఠం కొనసాగుతుండగా, పరిశీలించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రతి రోజూ స్కూల్ కు రావాలని విద్యార్థులకు సూచించారు. సిలబస్ ఫిబ్రవరిలో పూర్తి చేయాలని, వార్షిక పరీక్షలకు సాధన చేయించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులందరూ అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలని, ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడేలా సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు.