ఉపాధి హామీ పథకంతో పేదలకు ఆదాయ భద్రత
నూతనకల్, మే 21 : ఉపాధి హామీ పథకం గ్రామీణ పేద ప్రజలకు ఆదాయ భద్రతను కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం ఆత్మకూరు మండలంలోని నెమ్మికల్, నూతనకల్ మండలంలోని పోలుమల్ల, మద్దిరాల గ్రామాల్లో సాగుతున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భముగా ఎండ నుండి ఉపశమనం కోసం ఏర్పాటు చేసిన షెడ్, తాగునీరు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను పరిశీలించారు.
ఎండల తీవ్రత దృష్ట్యా కూలీలు ఉదయమే పనులు ముగించుకునేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో వడదెబ్బ తగిలిన వారికి తక్షణ వైద్యం అందించేందుకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన అత్యవసర మందులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి, వైద్యుల సలహాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డి ఆర్ డి ఓ సన్యాసయ అడిషనల్ పిడి చంద్రశేఖర్, ఆత్మకూరు ఎంపీడీవో హసిమ్, నూతనకల్ ఎంపీడీవో సునీత, మద్దిరాల ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి , ఏపీడి పవన్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






