04-09-2025 01:08:25 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమే విజయం సాధిస్తుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు తెలిపారు. 20 ఏళ్ల నితీష్కుమార్ పాలనపై అక్కడి రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వీహెచ్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ బీహర్లో చేపట్టిన దొంగ ఓట్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందన్నారు.
బుధవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత తమ ఇంటి పంచాయతీని కాంగ్రెస్పై రుద్దడం సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది కాబట్టే సీఎం రేవంత్రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారని వీహెచ్ తెలిపారు.
రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టు కుంగడమంటే.. ఎంత అవినీతి జరిగిందో ప్రజలందరికి తెలుసన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు వెనక సీఎం రేవంత్రెడ్డి ఉన్నారని కవిత చేసిన ఆరోపణలను వీహెచ్ ఖండించారు. పంపకాల్లో తేడా రావడంతోనే కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పుట్టిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు.