21-11-2025 07:54:17 PM
హుస్నాబాద్: ఇంటర్మీడియట్ విద్య సిద్దిపేట జిల్లా అధికారి (డీఐఈవో) రవీందర్ రెడ్డి శుక్రవారం హుస్నాబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్, అపోలో వొకేషనల్ జూనియర్ కాలేజీలను సందర్శించారు. విద్యార్థుల హాజరు నమోదు, కళాశాలల అనుబంధ ధృవపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. లెక్చరర్ల హాజరును పరిశీలించి, తరగతుల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. అపోలో వొకేషనల్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అందిస్తున్న 'ఆన్ ది జాబ్ ట్రైనింగ్' (వోజేటీ) వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రి, విద్యుత్ సబ్స్టేషన్, వ్యవసాయం, పశువైద్యం వంటి అంశాల్లో ఇస్తున్న శిక్షణ వివరాలను పరిశీలించారు. విద్యార్థులను సిలబస్ గురించి, అందులోని ముఖ్య ప్రశ్నల గురించి అడిగి, సమాధానాలను తెలుసుకున్నారు. విద్యార్థులు డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు లోను కాకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎలాంటి భయం లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని, కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉత్తమమైన స్థానాన్ని చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు.