13-08-2025 12:00:00 AM
ఉదయ సముద్రం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
నల్లగొండ టౌన్, ఆగస్టు 12 : ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి ఇద్దరు అసమర్థులేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని ఉదయ సముద్రం చెరువు వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి జగదీష్రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కృష్ణా బేసిన్లోకి పుష్కలంగా నీరు వచ్చిందన్నారు.
అయితే సంబంధిత అధికారులు జిల్లాలో పూర్తి స్థాయిలో చెరువులు నింపకుండా, మేజర్ల కింద, డిస్ట్రిబ్యూటరీల కింద నీళ్లు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ గేట్లు ఎత్తి సముద్రంలోకి ఆ నీటిని వృథాగా వదులుతున్నారని మండిపడ్డారు. దేవరకొండ, నల్లగొండ,నకిరేకల్ నియోజకవర్గంలో పొలాల్లో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ఇరువురు మంత్రులు కేవలం కమీషన్లు, ఆర్భాటాలకు తప్పితే వారివల్ల జిల్లాకు ఒరిగింది ఏమీ లేదన్నారు. కనీసం నీళ్లు ఇవ్వలేని చేతకాని మంత్రులని మండిపడ్డారు.బీఆర్ఎస్ హయాం లో ఉదయసముద్రం మత్తడి దుంకేలా అన్ని చెరువులు నింపామని, ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు నింపడం లేదని ప్రశ్నించారు.