calender_icon.png 6 July, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ ఎస్టీలపై చిన్న చూపు తగదు

05-07-2025 10:07:31 PM

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య..

కామారెడ్డి (విజయక్రాంతి): ఎస్సీ ఎస్టీలపై చిన్నచూపు తగదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య(Bakki Venkataiah) అన్నారు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం నుంచి అందే సౌకర్యాలను కల్పించాలన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు సూచించారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ సంఘాలు, అధికారులు, సంఘ సభ్యులతో వివిధ సమస్యలపై సమీక్షించారు. గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని గ్రామం మధ్యలో నిర్వహించి ఎస్సీ, ఎస్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి కొరకు రూపొందించిన చట్టాలు, సంక్షేమ పథకాలు గురించి సంపూర్ణ అవగాహనను కల్పించానన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు మొదటగా జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు అవసరమైన కేసుల వివరాల నివేధికను అందించాలని పోలీస్ అధికారులను కోరారు.

జూలై నెలాఖరులోగా పెండింగ్ లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసులను పరిష్కరించాలని, ప్రతినెల చివరి వారంలో సివిల్ రైట్స్ డెను ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు, విదేశి విద్య, రాజీవ్ యువశక్తి వంటి పథకాలను గురించి తెలియజేయండంతో పాటు చట్టాలు, సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ ఎస్సీ, ఎస్టీలను చైతన్య పరచాలన్నారు. సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను గ్రామంలోని చావడి, గ్రామపంచాయితి లేదా ప్రధాన కేంద్రంలో అన్ని కులాలను భాగస్వాములను చేసి శాఖపరమైన అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, ఈ కార్యక్రమానికి తప్పకుండా తాసిల్దార్, ఎస్ఐ, జిల్లా అట్రాసిటీ కమిటీ సభ్యులు హాజరుకావాలని సూచించారు. 

జిల్లాలో కొత్తగా జిల్లాడి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినందుకు, జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి 30 గుంటల స్థలాన్ని కేటాయించినందుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల ప్రాంతాల్లోనే ఉపయోగించాలని, కాంట్రాక్ట్ పనులలో ఎస్సీ ఎస్టీలకు వారి వాటాల ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు వారి రిజర్వేషన్ ప్రకారం వాటా కల్పించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీల భూసమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కరించాలన్నారు. మానవసేవయే మాధవ సేవ అని.. అధికారులకు సేవ చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని అన్నారు. జిల్లాలో ఉన్న 25% ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి అధికారులు చొరవ చూపాలని అన్నారు. కామారెడ్డి దేవునిపల్లిలో నడిపిస్తున్న లింగంపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను లింగంపేట లోనే నిర్వహించేందుకు అనువైన ప్రైవేట్ బిల్డింగును తాత్కాలికంగా చూడాలని ఆదేశించారు. 

లింగంపేటలో శాశ్వత గురుకుల భవనం నిర్మాణానికి స్థలాన్ని సేకరించాలని ప్రభుత్వం నుండి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. సదాశివ నగర్ మండలం లింగంపల్లి భికునూరు మండలం పెద్ద మల్లారెడ్డి  గ్రామాల్లో గల దళితుల భూముల సమస్యలను పరిష్కరించి వారి భూముల అభివృద్ధికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోర్లను వేయించాలని అన్నారు. ఎల్లారెడ్డిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాథమిక సమస్యను ఆర్డిఓ ఆధ్వర్యంలో పరిశీలించి వాటితోపాటు ఆ విద్యాలయంలో ఉన్న ఇతర సమస్యలను కూడా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమానికి హాజరైన పలువురు పలు కేసులు, సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్  మాట్లాడుతూ ఈ సమావేశంలో  తీసుకున్న నిర్ణయాలను  పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ను విసిట్ చేసి  విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడతామన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు మరింత వేగంగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు, ఎస్సీ, ఎస్టీల నిధులు సరిగా వినియోగ మయ్యేలా చూస్తామని, భూభారతి  యాక్ట్ ద్వారా ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూముల వివాదాలకు పరిష్కరిస్తామని పేర్కొన్నారు, ఇందిరమ్మ ఇండ్లలో ఎస్సీ ఎస్టీ వారికి తగిన ప్రాధాన్యం అమలయ్యేలా చూస్తామని తెలిపారు, వానాకాలం సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా అదనపు ఎస్పీ  చైతన్య రెడ్డి,  ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు, నీలాదేవి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, డీఎస్పీ లు, ఆయాశాఖల జిల్లా అధికారులు, ఎస్సి, ఎస్టి సంఘాల ప్రతినిదులు, తదితరులు పాల్గొన్నారు.