05-07-2025 11:23:51 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లోని కెనరా బ్యాంక్ పార్క్, సురభి పార్క్, టిఆర్టి గ్రౌండ్ లో సుందరీకరణ పనులను గాంధీనగర్ కార్పొరేటర్ ఏ. పావని వినయ్ కుమార్(Corporator A. Pavani Vinay Kumar) సందర్శించి పరిశీలించారు. జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ద్వారా మంజురు చేయించిన సుమారు రూ.25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సుందరీకరణ, అభివృద్ధి పనులను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, జిహెచ్ఎంసి అసిస్టెంట్ ఇంజనీర్ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి పర్యవేక్షించారు.
కెనరా బ్యాంక్ పార్క్ లో ప్రత్యేకమైన లైటింగ్ తో ఏర్పాటు చేసిన ‘ఐ లవ్ గాంధీనగర్‘ అనే బోర్డు ప్రజలను ఎంతో ఆకర్షిస్తుందని కార్పొరేటర్ తెలిపారు. పార్క్ చుట్టూ ఫెన్సింగ్, వాకర్స్ కొరకు పాత్ వే, పూల మొక్కల ఏర్పాటు వంటి సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని. త్వరలో అన్ని పార్కుల్లో చేపట్టిన పనులు పూర్తి చేసుకొని డివిజన్ లోని పార్కులన్నిటిని అత్యంత సుందరంగా తీర్చి దిద్దుతామన్నారు. నియోజకవర్గంలోనే గాంధీనగర్ డివిజన్ ను రోల్ మోడల్ గా నిలిపేందుకు అభివృద్ధి పనులను జరిపిస్తున్నట్లు కార్పొరేటర్ వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, నాయకులు సాయి కుమార్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్, స్థానికులు పాల్గొన్నారు.