దేశ రాష్ట్రపతిని కించపరచడం సిగ్గుచేటు
మేడ్చల్ అర్బన్: దేశ ప్రథమ పౌరురాలు అయినటువంటి ద్రౌపది ముర్ముపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని మేడ్చల్ బిజెపి నాయకురాలు బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి(BJP leader Krishnapriya Mallareddy) అన్నారు. శుక్రవారం బచ్చు కృష్ణప్రియ మీడియాతో మాట్లాడుతూ.. ఒక మహిళా మంత్రిగా ఉండి దేశంలోని అత్యుత్తమ స్థానంలో ఉన్నటువంటి మహిళపై దిగజారి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని కృష్ణప్రియ మండిపడ్డారు. కేంద్రంలో 71 మంత్రి పదవులకు గాను 42 మంది వెనకబడిన తరగతుల వారిని మంత్రివర్గంలోకి బిజెపి చేర్చుకుందని కృష్ణప్రియ పేర్కొన్నారు. కుల వివక్ష గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ముందు తెలంగాణలో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని ఘాటుగా ప్రశ్నించారు. దేశ రాష్ట్రపతిని కించపరిచి మాట్లాడడం దేశ ప్రజలందరినీ కించపరచడమేనని కృష్ణప్రియ మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు.






