01-05-2025 01:16:24 AM
జులై 24న చివరి బోనం
కార్వాన్, ఏప్రిల్ 30: ఎంతో చారిత్రాత్మక గోల్కొండ జగదాంబికా ఆలయ బోనాలకు వేళ అయింది. జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు నెల రోజులపాటు బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. ఎంతో చరిత్ర ఉన్న గోల్కొండ కోటలో వెలసిన జగదాంబిక అమ్మవారి ఆలయంలో మొదటి బోనంతో జంట నగరాల్లో బోనాల సందడి ప్రారంభం కానుంది. జూలై 24వ తారీకుతో వేడుకలు ముగియనున్నాయి.
బోనాల వేడుకలు జూన్ 26న గురువారంతో ప్రారంభం కానున్నాయి. అనంతరం వచ్చే ఆది గురువారాల్లో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటి పూజకు హైదరాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డితో పాటు శివారు ప్రాం తాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు.
బోనాలు నిర్వహించే తేదీలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జులై 13న సికింద్రాబాద్ బోనాలు జరుగుతాయి. అదేవిధంగా జూలై 20న హైదరాబాద్ నగరంలో బోనాలు నిర్వహించనున్నారు.
- వైభవంగా నిర్వహిస్తాం
ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం జగదాంబికా మహంకాళి అమ్మవార్ల బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జగదాంబిక ఆలయ వృత్తి పనివారల సంఘం ఉపాధ్యక్షుడు బొమ్మల శ్రీకాంత్ చారి తెలియజేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడాది కనివిని ఎరగని రీతిలో నిర్వ హించనున్నట్లు శ్రీకాంత్ చారి తెలిపారు.