13-05-2025 12:23:03 AM
టేకులపల్లి, మే 12 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఓసీ 2 లోని ఫిట్ 2, 3 లో సాగు భూములు కోల్పోయిన గిరిజన నిర్వాసితులకు హైకోర్టు తీర్పు ప్రకారం భూమి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని తెలంగాణ భూ నిర్వాసితుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేవోసీ పర్యటన సందర్భంగా నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలని పత్రికా ముఖంగా కోరారు. 2007 సంవత్సరం లో కోయగూడెం ఓసీ 2 లోని ఫిట్ 2, 3 కోసం గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములను ఎటువంటి నష్టపరిహారం, పునరావాసం చెల్లించకుండా తీసుకున్నారని తెలిపారు.
కానీ అప్పటికే అటవీ హక్కుల చట్టం 2006అమలులోకి రావటం వల్ల గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములు సర్వే నిర్వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమందికి హక్కు పత్రాలు కూడా ఇచ్చారు, 2008 లో గిరిజన నిర్వాసితులు గౌరవ హైకోర్టును ఆశ్రయించగా 2011 సంవత్సరం నవంబర్ 27న అటవీ హక్కుల చట్టం ప్రకారం కోయగూడెం ఓసీలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు భూమి పై హక్కులను గుర్తించి న్యాయం చేయాలని ఆదేశించిందని కానీ అధికారులు జీవో నెంబర్ 68 ప్రకారం భూమి కోల్పోయిన నిర్వాసితులకు ఆర్& ఆర్ కల్పిస్తామని తెలిపారన్నారు.
కానీ రిహాబిలిటేషన్ క్రింద కొంత పునరావాసం కల్పించారు, రీ సెటిల్మెంట్ క్రింద భూమికి బదులు భూమి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారన్నారు. దీంతో భూమి నష్టపరిహారం కోసం 2016 సంవత్సరంలో మళ్ళీ హైకోర్టు లో కేసు వేశారని తెలిపారు. 2024సంవత్సరం నవంబర్ నెలలో గౌరవ హైకోర్టు నిర్వాసితులకు నాలుగు వారాల్లో న్యాయం చేయాలని తీర్పు ఇచ్చిందని తెలిపారు.
కానీ ఆరు నెలలు గడుస్తున్నా గౌరవ హైకోర్టు తీర్పు అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిర్వాసితుల సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని ఆయన కోరారు.