05-08-2025 01:00:22 AM
మాజీమంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల అర్బన్, ఆగస్టు 4 (విజయ క్రాంతి): డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ సమయంలో ఇందిరమ్మ ఇల్లు కోల్పోయిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ను కోరారు. నూక పల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇండ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో లబ్ధిదారులు జీవన్ రెడ్డిని కలిసి గోడు వెళ్ళబోసుకున్నారు.
జీవన్ రెడ్డి బాధితులను వెంట తీసుకొని ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.లబ్ధిదారులకు గతంలో కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల కాగితాలు కలెక్టర్ కు అందజేశారు.అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ2008 లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు మంజూరు చే సిందని, అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు.
ఆ సమయంలో ఇల్లు కోల్పోయిన లబ్ధిదారులందరికీ ఇల్లు మంజూరు చేయాలన్నారు.అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మం జూరులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.గతం లోనే వివిధ దశల్లో ఉన్న 1611 నిర్మాణాలు పరిశీలించి రు.52 కోట్లు అవసరం అవుతాయని నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. అర్బన్ కాలనీ లో3500 ఇల్లు కేటాయించి రెండేళ్లు గడుస్తున్నా కేవలం 500 మంది మాత్రమే ఇళ్లలోకి చేరారని, మిగిలిన వారు సైతం ఇళ్లలోకి వెళ్ళేందుకు గడువు విధించాలని కోరారు.పాఠశాల, ప్రార్థన మందిరాలు నిర్మించాలనిసూచించారు.