calender_icon.png 5 August, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో కుండపోత

05-08-2025 01:43:53 AM

  1. మూడు గంటలు భారీ వాన 
  2. అత్యధికంగా బంజారాహిల్స్‌లో 11.23 సె.మీ.లు 
  3. గంటల తరబడి ట్రాఫిక్ జాం 
  4. స్తంభాన్ని పట్టుకున్న మహిళకు షాక్  
  5. బంజారాహిల్స్‌లో కూలిన చెట్టు 
  6. ఖాజాగూడలో చెట్టుపై పిడుగు 
  7. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం 
  8. మరో 3 రోజులు భారీ వర్షాలు

నగరంలో నమోదైన వర్షపాతం (సె.మీ.లలో)

బంజారాహిల్స్-11-2, షేక్‌పేట- 7.4, ఆసిఫ్‌నగర్-5.3, ఖైరతాబాద్- 5.0, అమీర్‌పేట-3.4, మెహిదీపట్నం -3, రాజేంద్రనగర్-2.9, కాప్రా-2.9, ఉప్పల్-2.3, మల్కాజ్‌గిరి-1.7 సెం.మీ.లుగా నమోదైంది. 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో సోమవారం మూడు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కురిసని కుండపోత వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. లక్డీకాపూల్, ఖైరతాబాద్, బంజా రాహిల్స్, అమీర్‌పేట, సికింద్రాబాద్, దిల్ సుఖ్‌నగర్ సహా నగరంలోని అన్ని ప్రధాన రహదారులు వరద నీటితో నిండిపోయా యి.

ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు గంటల తరబడి ఫ్లుఓవర్లపై, రోడ్లపైనే చిక్కుకుపోయారు. బంజారహిల్స్ రోడ్ నంబర్ 1లో రోడ్డుపై చెట్టు కూలి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎల్లారెడ్డిగూడలో లోతట్టు ప్రాంతా ల్లోని ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. అమీర్‌పేటలోని ఇమేజ్ హాస్పిటల్ ప్రాంతం ముంపునకు గురైంది. ఎర్రమంజిల్‌లో వాన కు తడిసిన స్తంభాన్ని నడుచుకుంటూ వెళ్తు న్న మహిళ పట్టుకోవడంతో షాక్ గురైంది.

స్పృహ తప్పి పడిపోయిన ఆమెను భద్రతా సిబ్బంది గమనించి, కాపాడారు. గచ్చిబౌలి ఖాజాగూడలోని లాంకో హిల్స్ వద్ద ఓ తాటి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సైఫాబాద్‌లోని కామత్ హోటల్‌లోకి భారీ గా వరద నీరు చేరడంతో వినియోగదారులు బయటకు రాలేక అక్కడే చిక్కుకుపోయారు. కాగా అత్యధికంగా బంజారాహిల్స్‌లో 11.23 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం న మోదయింది.

చినుకు పడితేనే చెరువులయ్యే రాజ్‌భవన్ రోడ్డులో, గతేడాది ఏర్పాటు చేసి న వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్‌లు సైతం నిండిపోయి నీరు రోడ్డుపైకి ప్రవహించింది. నగ రం మొత్తం 166 ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిందని జీహెఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

మరో రెండు రోజుల పాటు నగరానికి భారీ వర్ష సూచన ఉన్నందున, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని జీహెఎంసీ కమిషనర్ కర్ణన్ సూచించారు. సహాయక చర్యల కోసం 040-21111111, విపత్తుల నివారణ కోసం 9000113667 నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు.

రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో

సంగారెడ్డి/రంగారెడ్డి(విజయక్రాంతి)/రామచంద్రాపురం: సంగారెడ్డి జిల్లాలో సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. గంటపాటు వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు, మురికి కాలువలు పొంగిపొర్లి రోడ్ల పైనుంచి ప్రవహించా యి. రోడ్లపై నీరు నిల్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో సో మవారం మధ్యాహ్నం నుంచి  పలు నియోజకవర్గాల్లో వాన దంచి కొట్టింది. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్, బడంగ్పేట్, ఆమనగల్, కడ్తాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, తుర్కయంజాల్, యాచారం, ఎల్బీన గర్, కొత్తపేట్, సరూర్నగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో కుండపోతగా కురిసింది. లోత ట్టు ప్రాంతాలు  జలమయం కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. 

సహాయక బృందాలు అందుబాటులో ఉండాలి: సీఎం

హైదరాబాద్(విజయక్రాంతి): హైదరాబాద్‌తో పాటు రాష్ర్టవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉం డాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశా రు. రాష్ర్ట సచివాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ర్టవ్యాప్తంగా వరద నీటి ఉద్ధృ తి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. రానున్న రెండుమూడు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఎక్కడా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాలు, వరదలతో ఎలాంటి పరిస్థి తులు తలెత్తినా వాటిని ఎదుర్కునేందుకు, సహాయమందించేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించా రు. విపత్తు సహాయక బృందాలు అందుబాటులో ఉండాలని, తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

రేపటి నుంచి 3 రోజులు భారీ వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంగళవారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 6 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈనెల 6న నాగర్‌కర్నూలు, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

ఈ నెల 7న మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ నెల 8న నల్లగొండ, నాగర్‌కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

అధికారుల సమన్వయ లోపం

వర్షాకాల సహాయక చర్యల బాధ్యతను ప్రభుత్వం హైడ్రాకు అప్పగించినా, జీహెఎంసీ సిబ్బంది సహకరించాలని కమిషనర్ కర్ణన్ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. కానీ సోమవారం నాటి విపత్కర పరిస్థితుల్లో ఆ సమన్వయం ఎక్కడా కనిపించలేదు. వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నప్పటికీ, జీహెఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో కనిపించకపోవడంపై నగరవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇరు శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో సహాయక చర్యలు కూడా మందకొడిగా సాగాయి. కాగా భారీ వర్షం నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. నేరుగా వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు వెళ్లారు. లకడికాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో పర్యటించారు.  డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు.. హైడ్రా మాన్సూన్ ఎమర్జన్సీ బృందాలతో మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.