07-06-2025 12:03:57 AM
- విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం
- 69 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం
ఖైరతాబాద్, జూన్ 6: ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవాలు హైదరాబాద్లో అత్యం త వైభవంగా నిర్వహిస్తారు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. వినాయక చవితికి మూడు నెలల ముందుగానే ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీ పనులు కర్ర పూజతో ప్రారంభమవుతాయి.
శుక్రవారం ఈ కర్ర పూజను రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయరెడ్డి ప్రారంభించారు. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ విగ్రహం 69 అడుగుల ఎత్తులో ఉండనుంది.
గత ఏడాది 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. విగ్రహ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుంది. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడానికి ఉత్సవ కమిటీలు సిద్ధంగా ఉన్నాయి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు 1954లో సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు ఒక అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో ప్రారంభమయ్యాయి.
స్వాతంత్య్ర ఉద్యమకారుడు బాలగంగాధర తిలక్ స్ఫూర్తితో ఐక్యతకు చిహ్నంగా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. 2014 వరకు ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ వచ్చారు. ఆ తర్వాత పర్యావరణ కారణాల వల్ల కొంత ఎత్తును తగ్గించారు. ప్రస్తుతం శంకరయ్య సోదరుడు సింగరి సుదర్శన్ వినాయకుడి ఏర్పాట్లను చూసుకుంటున్నారు.