21-05-2025 02:31:18 PM
టన్నెల్ లో మృతదేహాలను తీసుకురాలేని చేతగాని ప్రభుత్వం
కాలేశ్వరం పై నోటీసులు దూది పింజల్లా ఎగిరిపోతాయి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా పాలన జరపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల పాలన కొనసాగిస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు(Kalvakuntla Taraka Rama Rao) ఆరోపించారు. నల్లగొండ పట్టణంలో బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కమీషన్ల కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్ లో గల్లంతయిన కార్మికుల మృతదేహాలను మూడు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకురాలేకపోయిందని విమర్శించారు.
కమిషన్లు లేనిదే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు ఏ పనులు చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పై ఎన్ని నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వి చిల్లర ప్రయత్నాలు అన్నారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించనున్నారని విమర్శించారు.గత 17 నెలలుగా పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోందని విమర్శించారు.కమిషన్లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదు. కమీషన్లు ఇస్తేనే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించే హీన స్థితికి చేరుకుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిని తట్టుకోలేక కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు.
నల్లగొండలో సుంకిషాల ప్రాజెక్ట్ కూలినా ఇప్పటికీ ప్రభుత్వం స్పందించ పోవడం శోచనీయమన్నారు.కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి, ప్రజల సమస్యలపై కాకుండా పచ్చి నాటకంపై దృష్టి పెట్టారని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొడుతున్నారని తెలిపారు.ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని. నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని చేతగాని ప్రభుత్వంమని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా తాము డిమాండ్ చేస్తుంటే విచారణలు, కమిషన్ల పేరిట ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ఆడపడుచులకు తులం బంగారం ఏమైంది.? 4 వేల రూపాయల పింఛన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని,ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీందర్ నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద బిక్షమయ్య గౌడ్ పాల్గొన్నారు.