calender_icon.png 4 December, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుముల రేవంత్ రెడ్డి కాదు.. అవినీతి అనకొండ

04-12-2025 04:24:36 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాదు... అవినీతి అనకొండ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) విమర్శించారు. హైదరాబాద్ నగరంలోని పారిశ్రామికవాడల్లో ఉన్న 5 లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకునే హెచ్ఐ ఎల్ టి పీ కుట్ర మీద బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోరుబాట చేస్తూ గురువారం జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని పలు పరిశ్రమలను సందర్శించి, కార్మిక సమస్యలపై కార్మికులతో, పారిశ్రామిక వేత్తలతో చర్చించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ముఖంగా సీఎం రేవంత్ రెడ్ది(CM Revanth Reddy) తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ ఐ ఎల్ టి పీ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ పాలసీ) పేరుతో 5 లక్షల కోట్ల రూపాయల భారీ భూ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపించారు.

ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు, పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. పరిశ్రమలు వద్దంటూ... అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు అవి ప్రైవేట్ వ్యక్తుల భూములు కావు. ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములు. కేవలం పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనలతోనే ఆ భూములను ఇవ్వడం జరిగిందన్నారు. మార్కెట్‌లో గజం ధర లక్షన్నర రూపాయలు పలుకుతుంటే, ప్రభుత్వం కేవలం 4,000 రూపాయలకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తోందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో పేదలకు ఇండ్లకు, పాఠశాలలకు, ఆసుపత్రులకు, చివరికి స్మశానాలకు కూడా స్థలం లేదు. కానీ, ప్రైవేట్ వ్యక్తులకు 9,300 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పనంగా ఇస్తామంటోంది.

ఈ 9,300 ఎకరాల భూములను తిరిగి వెనక్కి తీసుకొని, అక్కడ కాంగ్రెస్ చెబుతున్న ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్కూల్స్, ఆసుపత్రులు కట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో స్థలం లేదని చెప్పి ఇప్పటిదాకా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ కట్టలేదని అన్నారు. ఇక్కడ ఉన్న కంపెనీలు తరలివెళ్తే, హైదరాబాద్ నగరంలో వాటిపైన ఆధారపడిన లక్షల మంది ఉపాధి పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుంభకోణాన్ని ప్రజలకు వివరించేందుకే నేడు పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్నాము. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్న భూముల ధర నిర్ధారణ, దాని వెనుక ఉన్న అసలు నిజాలు నిగ్గుతేల్చాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తున్నామని తెలిపారు. ఈ అంశాన్ని ఇక్కడితో మా పార్టీ వదిలిపెట్టదు. హిల్ట్ పాలసీ కుంభకోణం పైన త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, నగరంలో కాలనీలలో ప్రజలకు ఈ అంశాన్ని వివరిస్తామని తెలియజేశారు.

ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు పోతాము.ఈ పాలసీని వెనక్కి తీసుకొని, లక్షల కోట్ల విలువైవ ప్రజల భూమిని కాపాడే దాకా మా పోరాటం కొనసాగుతుందన్నారు. మా ప్రభుత్వం రాగానే ఈ పాలసీని రద్దు చేస్తాము. అవసరమైతే ఇందుకోసం ఒక చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు.ఈరోజు రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా అత్యాశకు వెళ్లి ప్రభుత్వానికి డబ్బులు కడితే, అటు పారిశ్రామిక భూములతో పాటు డబ్బులు కూడా పోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవలన్నారు. ఒకవైపు 170 కోట్ల రూపాయలకు ఎకరం చొప్పున భూములు అమ్మిన ప్రభుత్వం అంటూ రోజు వార్తలు రాయించుకుంటున్న సర్కార్, మరోవైపు కేవలం కోటి రూపాయలకు ఎకరం చొప్పున జీడిమెట్లలో భూమిని ఎలా అమ్ముతుందని ప్రశ్నించారు.ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుంభకోణానికి క్షేత్రస్థాయిలో ఉన్న నిదర్శనమని ఆరోపించారు.

మేము గతంలో తెచ్చిన గ్రిడ్ పాలసీ ద్వారా కేవలం ఐటీ కార్యాలయాలు మాత్రమే నిర్మాణం చేసేందుకు అవకాశం ఉండేది. ఐటీ కార్యాలయాల ఏర్పాటు వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరిగాయాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మా పాలసీ ఆదర్శం అయితే... ఈ పారిశ్రామిక భూములలో ఎలాంటి కాలుష్యం లేని పరిశ్రమలకు మాత్రమే తిరిగి భూములు కేటాయించాలి. ఐటీ వంటి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు మాత్రమే అనుమతించాలని,అంతేకానీ అప్పనంగా అపార్ట్‌మెంట్లకు, విల్లాలకు ఇస్తామంటే కుదరదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎల్ఫీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు , సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్ది, పార్లమెంటరీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి,ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.