బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం
మంత్రి సీతక్క
ఆదిలాబాద్, మే 10 (విజయక్రాంతి): బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పని చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్లో పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి పాల్గొన్నారు.
అలాగే రూరల్ మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ పదేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయలేకపోయింది.. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద, మధ్య తరగతి వర్గాలపై భారం మోపిందని విమర్శించారు. దేవుడు పేరు చెప్పి రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని, కాంగ్రెస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.






