12-08-2025 12:52:35 AM
యాదాద్రి భువనగిరి ఆగస్టు 11 ( విజయ క్రాంతి): యువత, విద్యార్థులు,ప్రజలు గంజాయి బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు మినీ మీటింగ్ హాల్ లో జిల్లా లో గంజాయి నియంత్రణపై నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ అక్షాంక్ష్ యాదవ్ , అడిషనల్ డిసిపి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని పోలీస్, ఎక్సైజ్, డ్రగ్స్ఇన్స్పెక్టర్, వైద్య, విద్యా, అటవీ, ఆర్టీసీ, సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలని అన్నారు. జిల్లా లో అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాకు సరిహద్దు రాష్ట్రాల నుండి గంజాయి పదార్థాలు రాకుండా అన్ని చెక్ పోస్ట్ లలో గట్టి నిఘా పెంచి పటిష్ఠ చర్యలు చేపట్టాలని, ఆదేశించారు.
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు అవసరమైతే భవిష్యత్తును నాశనం చేసే గంజాయిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారుల ద్వారా గంజాయి పై గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ అక్షాంక్ష్ యాదవ్ మాట్లడుతూ.. సంబంధిత అధికారులు అందరూ గంజాయి పై ప్రజలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ల వద్ద గట్టి నిఘా ఉంచామని తెలిపారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లా గా తీర్చిదిద్దేందుకు సమాచారం అందించడంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరం అన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపర్నెంట్ విష్ణుమూర్తి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.