31 March, 2026 | 4:53 AM

మహిళా శక్తి కారణంగానే ప్రపంచంలో ముఖ్య దేశంగా భారత్

14-09-2025 01:06 PM

హైదరాబాద్: భారత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్దాలకు ముందే ప్రారంభమైందని.. మహిళకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సాంప్రదాయమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Lok Sabha Speaker Om Birla) తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సు(Women Empowerment Summit)లో లోక్‌సభ స్పీకర్ మాట్లాడారు. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో స్త్రీలు కీలకపాత్ర పోషించారని.. అలాగే స్వాతంత్య్ర పోరాటంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశము అభివృద్ధి చెందలేదని.. సామాజిక బంధనాలను ఛేదించుకొని మహిళలు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని అన్నారు.

మహిళల అభివృద్ధి కోసం రాజ్యాంగం అనేక నిబంధనలు రూపొందించిందని అన్నారు. మహిళా శక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే ముఖ్య దేశంగా భారత్ అవతరించిందని.. అనేక కీలక రంగాల్లో ఇవాళ మహిళలు నాయకత్వ స్థానాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఆదివాసి నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ఇవాళ రాష్ట్రపతిగా ఉన్నారని.. రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, సైన్యంలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశామని పేర్కొన్నారు.