రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు..
గార్ల/మహబూబాబాద్ (విజయక్రాంతి): గార్ల మండలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా యూరియా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు మండల ప్రత్యేక అధికారి డిపిఓ హరిప్రసాద్(Mandal Special Officer DPO Hariprasad) తెలిపారు. ఆదివారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఇబ్బంది కలగకుండా మండల పరిధిలో నాలుగు క్లస్టర్ రైతు వేదికలలో యూరియా పంపిణీకి ఏర్పాటు చేసి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 877 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినట్లు తెలిపారు. పోలీస్, వ్యవసాయ శాఖ సమన్వయంతో పంపిణీ సజావుగా జరుగుతుందని అన్నారు. ఈ సమన్వయ సమావేశంలో తహసిల్దార్ శారద, ఎంపీడీవో మంగమ్మ, ఎస్సై రియాజ్ పాషా, వ్యవసాయ అధికారి కావటి రామారావు, విస్తరణ అధికారి మేఘన తదితరులు పాల్గొన్నారు.






