7 May, 2026 | 5:08 AM

అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు

02-08-2025 12:00 AM
  1. ఈడీ విజ్ఞప్తి మేరకు సర్క్యులర్ 
  2.    ౩వేల కోట్ల మనీలాండరింగ్ ఆరోపణలు

ముంబై, ఆగస్టు 1: రిలయన్స్ గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అంబానీపై శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. రూ. 3,000 కోట్ల లోన్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసు విషయంలో కీలక నిందితుడిగా ఉన్న అనిల్ అంబానీ దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు ఈడీ విజ్ఞప్తి మేరకు లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. ఆగస్టు 17న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఇప్పటికే అనిల్ అంబానీకి సమన్లు జారీ చేశారు.

మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రుణ మోసానికి సంబంధించి అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు, కార్యాలయాల్లో ఇప్పటికే ఈడీ తనిఖీలు చేసింది. ఈ సోదాల్లో పలు కీలక దస్త్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అంబానీకి లుకౌట్ నోటీసులు జారీ కావడం మరింత చర్చనీయాంశం అయింది.