01-05-2025 12:40:55 AM
కలెక్టర్ బి.యం.సంతోష్
గద్వాల, ఏప్రిల్ 30 ( విజయక్రాంతి ) : సమాజంలో కుల,వర్ణ,లింగ వివక్షతను వ్యతిరేకించిన గొప్ప అభ్యుదయవాది శ్రీ మహాత్మా బసవేశ్వరుడని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం ఆవరణంలో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బసవేశ్వర జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని,బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి,జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, శ్రీ మహాత్మా బసవేశ్వరుడు కుల, వర్ణ, లింగ భేదాలు లేని సమసమాజ నిర్మాణం కోసం గళం విప్పి సమానత్వాన్ని ప్రబోధించి సమాజంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారని పేర్కొన్నారు.మహిళలకు గౌరవస్థానం ఇవ్వడం, సాధికారత కల్పించడంలో ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని అన్నారు.
శ్రమకు గౌరవం, నీతి, నిష్ఠా,సత్యాన్ని బసవేశ్వరుడు తన జీవిత విధానంగా మార్చుకున్నారని అన్నారు.ప్రతి ఒక్కరూ బసవేశ్వరుని ఆదర్శాలను అనుసరించి, సమాజంలో మంచి మార్పుకు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఆయన వచనాలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్షీ నారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు,బిసి సంక్షేమ అధికారి రమేష్ బాబు, ఏఓ నరేందర్, అధికారులు, సంఘం సభ్యులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.